సురేఖకి అండగా మేమందరం ఉన్నాం: పొన్నం

October 06, 2024


img

మంత్రి కొండా సురేఖపై టాలీవుడ్‌ ప్రముఖులు పోటాపోటీగా విమర్శలు గుప్పిస్తుంటే ఆమెకు బాసటగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ తప్ప మరెవరూ మాట్లాడలేదు. ఇది చాలా సున్నితమైన విషయం కనుక అందరూ సంయమనం పాటించారని భావించవచ్చు. 

అయినా మంత్రి కొండా సురేఖపై ఇంకా విమర్శలు వస్తుండటంతో ఈసారి సీనియర్ కాంగ్రెస్‌ నాయకుడు, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆమెకు మద్దతుగా మాట్లాడారు. 

శనివారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని అక్కినేని నాగార్జున కోరిన వెంటనే ఆమె వెనక్కు తీసుకొని క్షమాపణలు కూడా చెప్పారు. కనుక అక్కడితో ఈ వివాదం ముగిసిన్నట్లే. కాదని మా బీసీ మంత్రి కొండా సురేఖపై ఎవరైనా విమర్శలు కొనసాగిస్తే ఆమె ఒంటరి కాదని, ఆమెకు తోడుగా మేమందరం ఉన్నామని గుర్తుంచుకోవాలి,” అని అన్నారు. 

మంత్రి పొన్నం ప్రభాకర్‌ కాస్త మృదువుగా చెప్పిన్నప్పటికీ ఆమె జోలికి ఎవరూ రావద్దని వస్తే సహించబోమని హెచ్చరించిన్నట్లే భావించవచ్చు. కనుక అక్కినేని నాగార్జున మంత్రి కొండా సురేఖపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తారో లేదో త్వరలో తెలుస్తుంది.

ఒకవేళ వేస్తే నాగార్జునపై ‘మన కోసం’ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన పోలీస్ ఫిర్యాదులో కదలిక మొదలవుతుంది.

నాగార్జున తుమ్మిడికుంట చెరువుని కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించి పర్యావరణ విధ్వంసం చేశారని, ఎన్ కన్వెన్షన్ నుంచి అద్దెల రూపంలో కోట్లాది రూపాయలు ఆర్జించారని, కనుక ఆయనపై భారీ జరిమానా విధించి వసూలు చేయాలని, ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కసిరెడ్డి భాస్కర్ రెడ్డి పోలీసులను కోరారు.

కానీ పోలీసులు ఆయన ఫిర్యాదుని స్వీకరించారు కానీ నాగార్జునపై కేసు నమోదు చేయలేదు. ఒకవేళ నాగార్జున మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేస్తే, నాగార్జునపై ఈ కేసు నమోదయ్యే అవకాశం ఉంటుంది. కనుక ఇప్పుడు నాగార్జునే ఆలోచించుకోవలసి ఉంటుంది.


Related Post