తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్గా నియమితులైన జిష్ణుదేవ్ ప్రశాంత్ వర్మ బుధవారం మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయం చేరుకోగా ఆయనకు సిఎం రేవంత్ రెడ్డి సీఎస్ శాంతి కుమారి, డిజిపి జితేందర్ తదితరులు సాధారంగా స్వాగతం పలికారు.
నిన్న సాయంత్రం 5 గంటలకు రాజ్భవన్లో గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తదితరులు, ఉన్నతాధికారులు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే ఆయన చేత గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేయించారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గవర్నర్ నరసింహన్తో సఖ్యతగానే ఉండేవారు కానీ ఆయన తర్వాత గవర్నర్గా వ్యవహరించిన తమిళిసై సౌందర్ రాజన్ పట్ల చాలా అనుచితంగా వ్యవహరించి తన ప్రతిష్టని మసకబార్చుకున్నారు.
సిఎం రేవంత్ రెడ్డి మాత్రం ఆమెతో చాలా గౌరవంగా వ్యవహరించారు. అందువల్లే గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీల నియామకానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిఫార్సు చేసిన ఇద్దరి పేర్లను ఆమె వెంటనే ఆమోదించారు. అయితే అప్పుడు కూడా బిఆర్ఎస్ పార్టీ ఆమె నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టుకి వెళ్ళడంతో ఆ నియమాకాలు ఆగిపోయాయి. అది వేరే సంగతి.
కానీ ఆ చేదు అనుభవాల తర్వాత గవర్నర్తో గౌరవంగా వ్యవహరించాలనే విషయం బిఆర్ఎస్ పార్టీ గ్రహించిన్నట్లే ఉంది. అందుకే నిన్న జరిగిన కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తదితరులు హాజరయ్యారని భావించవచ్చు.