తెలంగాణలో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల మద్య చాలా కాలంగా ఆధిపత్యపోరు సాగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఇంకా పెరిగింది. కానీ నేడు తొలిసారిగా రెండు పార్టీలు శాసనసభలో ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ దివంగత బిఆర్ఎస్ ఎమ్మెల్యే లాశ్య నందిత మృతిపట్ల రెండు పార్టీలు సంతాపం వ్యక్తం చేశాయి. అది సహజమే.
కానీ నేడు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు నిధులు, ప్రాజెక్టులు లేకపోవడం కనీసం తెలంగాణ ప్రస్తావన లేకపోవడంపై తొలిసారిగా కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు ముక్త కంఠంతో కేంద్రం తీరుని ఖండించాయి.
కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల పట్ల ముఖ్యంగా తెలంగాణ పట్ల వివక్ష చూపిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఏపీ, బిహార్ రాష్ట్రాల కోసమే రూపొందించిన రాజకీయ ప్రేరిత బడ్జెట్లా ఉంది తప్పితే ఫెడరల్ స్పూర్తి బడ్జెట్లో ఎక్కడా కనిపించలేదన్నారు. పొరుగు రాష్ట్రం ఏపీ రాజధాని లేదు కనుక దాని కోసం రూ.15,000 కోట్లు ఇస్తే మంచిదే కానీ తెలంగాణను అసలు పట్టించుకోకపోవడం సరికాదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇంచుమించు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగా ప్రయత్నించకపోవడం వలననే ఈవిదంగా జరిగిందని ఆరోపించారు. ఏపీకి రూ.15,000 కోట్లు కేటాయించినందుకు సంతోషిస్తున్నానని, కానీ తెలంగాణకు ఒక్క రూపాయి కేటాయించకపోవడాన్నే సరికాదన్నారు.