“కాంగ్రెస్ కుట్రలన్నీ గోదావరిలో కొట్టుకుపోయాయి. కానీ మేడిగడ్డ బ్యారేజి మాత్రం ఠీవిగా నిలబడి ఉందంటూ” కేటీఆర్ చేసిన ట్వీట్కు తెలంగాణ కాంగ్రెస్ చాలా ఘాటుగా బదులిచ్చింది.
దానికి తెలంగాణ కాంగ్రెస్ కూడా అంతే ధీటుగా బదులిచ్చింది. “నాడు కాళేశ్వరం ప్రాజెక్టు నిధులన్నీ దొరగారి ఫామ్హౌస్కి తరలిపోయాయి కాబట్టే.. నేడు గోదావరి నీళ్లన్ని సముద్రానికి తరలిపోతున్నాయి. కేసీఆర్ & కో కాసులకు కక్కుర్తి పడి, అంచనాలను పెంచి, అడ్డదిడ్డంగా కట్టిన ప్రాజెక్టు నేడు దేనికి పనికి రాకుండా పోతుంది.
నీళ్లాగితే ప్రాజెక్టు కుప్ప కూలుతుంది కాబట్టే, వచ్చిన నీళ్లన్నీ వచ్చినట్టే కిందికి పోతుంటే.. అది కూడా సిగ్గు లేకుండా గొప్పగా చాటి చెప్పుతున్నారు. ప్రజాధనం వృధా చేసిన.. మీకు కొంచెం కూడా పశ్చాత్తాపం లేదు!
వరద నీరు వస్తే మునిగిపోయి, కూలిపోయే పేకమేడ లాంటి దిక్కుమాలిన ప్రాజెక్టు ఒకటి కట్టిల్లు. ఇప్పుడు వర్షాలు పడి గోదావరి నది ప్రవహిస్తూ.. తెలంగాణలో సాగునీటి కోసం, తాగునీటి కోసం నిల్వ చేయవలసిన నీళ్లన్నీ సముద్రం పాలు అవుతుంటే సన్నాసులు సంకలు గుద్దుకుంటున్నారు.
80 వేల పుస్తకాలు చదివిన మహా మేధావి, తమకు తామే కాళేశ్వరరావుగా నామకరణం చేసుకొని, రివర్స్ ఇంజనీరింగ్ పేరుతో ప్రాజెక్టు మొత్తం ఉల్టా పల్టా చేసిండు.
రిజర్వాయర్లు కట్టేది నీటి నిల్వ కోసమని, సముద్రంలోకి వదలడం కోసం కాదనే ఇంగిత జ్ఞానం లేని సన్నాసులు ఇన్నేళ్లు పాలించడం వల్లే తెలంగాణ అప్పుల పాలైంది. కానీ దొరగారు, దొరగారి కుటుంబం, దొరగారు పెట్టిన పార్టీ మాత్రం అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతుంది.,” అంటూ ఘాటుగా బదులిచ్చింది.
దేశంలో బిఆర్ఎస్ పార్టీ అత్యంత ధనిక పార్టీగా, వడ్డీల రూపంలో అత్యంత ఎక్కువ ఆదాయం వస్తున్న పార్టీగా నిలిచిందన్న వార్తలపై స్పందిస్తూ తెలంగాణ కాంగ్రెస్ చివరిలో ఈ పంచ్ డైలాగ్ కొట్టిన్నట్లుంది.