బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కడుతుండటంతో ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య వేగంగా తగ్గిపోతోంది.
పటాన్చెరు బిఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోమవారం రాత్రి జూబ్లీహిల్స్లోని సిఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆయనతో కలిపి ఇప్పటి వరకు మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఉప ఎన్నికలో ఆమె సోదరి లాస్య నివేదిత పోటీ చేసి ఓడిపోవడంతో ఆ సీటుని కూడా కాంగ్రెస్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. తాజా చేరికతో శాసనసభలో కాంగ్రెస్ బలం 65 నుంచి 74కి పెరగగా, బిఆర్ఎస్ పార్టీ బలం 39 నుంచి 28కి పడిపోయింది.
కొన్ని రోజుల క్రితమే ఈడీ అధికారులు మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు మధుసూధన్ రెడ్డి వారి బంధు మిత్రుల ఇళ్ళలో సోదాలు నిర్వహించారు. మహిపాల్ రెడ్డి సోదరులు బినామీ పేర్లతో అక్రమ మైనింగ్ ద్వారా దాదాపు రూ.300 కోట్లకు పైగా అక్రమాస్తులు సంపాదించారని ఈడీ అధికారులు ప్రకటించారు.
మహిపాల్ రెడ్డిపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కేసుల నుంచి బయటపడేందుకు మహిపాల్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి బీజేపీ పెద్దలతో సంప్రదింపులు జరిపి ఆ పార్టీలో చేరేందుకు సిద్దపడిన్నట్లు ఊహాగానాలు వినిపించాయి. కానీ బీజేపీలో చేరాలంటే ముందుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని షరతు విధించడంతో అందుకు ఇష్టపడని మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఇప్పటి వరకు బిఆర్ఎస్ పార్టీని వీడిన ఎమ్మెల్యేలు:
1. ప్రకాష్ గౌడ్
2. బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి
3. సంజయ్ కుమార్
4. పోచారం శ్రీనివాస్ రెడ్డి
5. దానం నాగేందర్
6. కడియం శ్రీహరి
7. తెల్లం వెంకట్రావు
8. కాలే యాదయ్య
9. అరికెపూడి గాంధీ
10. గూడెం మహిపాల్ రెడ్డి.
కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు:
1. బస్వరాజు సారయ్య
2. దండే విఠల్
3. యెగ్గే మల్లేశం
4. భాను ప్రసాదరావు
5. ప్రభాకర్ రావు
6. బొగ్గారపు దయానంద్.