గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే 2017లో సింగరేణి సంస్థ బొగ్గు గనుల వేలంపాటలో పాల్గొని ఒడిశాలోని అంగుల్ జిల్లాలోని నైనీ బ్లాక్ని దక్కించుకుంది. కానీ ఆ ప్రాంతంలో ప్రైవేట్, అటవీ భూములు ఉన్నందున సింగరేణి సంస్థ ఇంతవరకు నైనీ బ్లాకులో బొగ్గు తవ్వకాలు ప్రారంభించలేకపోయింది.
సింగరేణి తరపున తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మంఝీకి లేఖ వ్రాసి, నైనీ బ్లాకులో బొగ్గు తవ్వకాలకు వీలు కల్పించేందుకు ఆ ప్రాంతంలోని ప్రైవేట్, అటవీభూములను సింగరేణికి బదలాయించాలని, రోడ్లు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరారు.
ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మంఝీ దానిపై సానుకూలంగా స్పందించడమే కాకుండా అప్పటికప్పుడు సంబందిత అధికారులకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నైనీ బ్లాకులో సింగరేణి బొగ్గు తవ్వకాలు, వాణిజ్య లావాదేవీలు ప్రారంభిస్తే ఒడిశా ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో సుమారు రూ.600 కోట్లు ఆదాయం లభిస్తుంది.
అంతేకాదు... బొగ్గు తవ్వకాలకు వేలాది మంది కార్మికులు, ఇతర సిబ్బంది ఆవసరం ఉంటుంది. కనుక ఒడిశా ప్రభుత్వానికి భారీ ఆదాయంతోపాటు, ఆ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు భారీగా ఉద్యోగాలు, ఉపాధి కూడా లభిస్తాయి.