బిఆర్ఎస్ పార్టీకి నేడు మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి శనివారం సిఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. దీంతో బిఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 32కి పడిపోయింది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంలో చనిపోవడంతో ఉప ఎన్నిక జరిగింది. దానిలో ఆమె చెల్లెలు లాస్య నివేదిత బిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి, బీజేపీ అభ్యర్ధి చేతిలో ఓడిపోవడంతో ఆ సీటు బిఆర్ఎస్ పార్టీ చేజారి పోయింది.
దీంతో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 38కి తగ్గగా, నేడు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డితో కలిపి ఇప్పటివరకు ఆరుగురు ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. దీంతో ఆ మేరకు శాసనసభలో కాంగ్రెస్ బలం పెరగగా, బిఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య క్రమంగా తగ్గుతూ 32కి చేరుకుంది. మరో ఐదుగురు ఎమ్మెల్యేలు త్వరలో బిఆర్ఎస్ పార్టీ వీడేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం.