తెలంగాణ విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి జస్టిస్ నరసింహా రెడ్డి కమీషన్ నోటీస్ పంపింది. వారం రోజులలోగా కమీషన్ ఎదుట హాజరయ్యి ఛత్తీస్ఘడ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి ధర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాలపై సంజాయిషీ ఇవ్వాలని దానిలో సూచించింది.
జగదీష్ రెడ్డి కూడా కమీషన్ నుంచి తనకు నోటీస్ అందిందిందని, త్వరలోనే తప్పకుండా కమీషన్ ఎదుట హాజరయ్యి వారి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తానని చెప్పారు. అలాగే ఈ మూడు పనులలో ఏదో పెద్ద తప్పు, కుంభకోణం జరిగిపోయిందన్నట్లు అపోహలు సృష్టిస్తున్న అధికారులను తాను కూడా ప్రశ్నించి వివరణ తీసుకుంటానని చెప్పారు.
అయితే ఈ మూడు పనులలో భాగస్వాములుగా ఉన్న అధికారులని, కాంట్రాక్ట్ కంపెనీలను, బీహెచ్ఈఎల్ సంస్థ అధికారులను, ఛత్తీస్ఘడ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ను కూడా విచారించకుండా నిజానిజాలు బయటపడవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ దురుదేశ్యంతోనే ఈ విచారణ జరిపిస్తోందని జగదీష్ రెడ్డి ఆరోపించారు. కనుక కమీషన్ అందరికీ నోటీసులు పంపించి, అందరి నుంచి వీటికి సంబందించి పూర్తి వివరాలు సేకరించి సమగ్ర విచారణ జరిపించి నిజానిజాలు నిగ్గు తేల్చి ప్రజల ముందుంచాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు.