సిఎం కేసీఆర్ ఇవాళ్ళ ఖమ్మం జిల్లా మధిరలో ఎన్నికల ప్రచారసభలో పాల్గొని మాట్లాడుతూ, “ఈసారి ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నాయకులు పగటి కలలు కంటున్నారు. ఆ పార్టీలో ఓ డజను మంది ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్నారు. కానీ ఈసారి వారికి 20 సీట్లు మాత్రమే వస్తాయి. బిఆర్ఎస్ పార్టీకి గతంలో కంటే ఓ రెండు మూడు సీట్లు ఎక్కువ వస్తాయి. మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాము.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న భట్టి విక్రమార్క మీ నియోజకవర్గంలో ఎన్నిసార్లు పర్యటించారు? నియోజకవర్గం అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఏమి చేశారు? ఆయన దళితులను ఎప్పుడూ ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారు తప్ప ఏనాడూ వారి సంక్షేమం కోసం ఏమీ చేయలేదు. భట్టి విక్రమార్క ఎప్పుడూ హైదరాబాద్లోనే కాలక్షేపం చేస్తుంటారు. ఇప్పుడు ఎన్నికలు కనుక మీ మద్యన తిరుగుతున్నారు. నియోజకవర్గాన్ని, ప్రజలను పట్టించుకొని ఇటువంటి నేత మీకు అవసరమా? ఈశాయి ఆయనకు మధిరలో ఒక్క దళిత ఓటు కూడా పడకూడదు. బిఆర్ఎస్ అభ్యర్ధి కమల్ రాజుని గెలిపిస్తే మధిర నియోజకవర్గం అభివృద్ధికి ఆయన గట్టిగా కృషి చేస్తారు. ప్రభుత్వం తరపున ఆయనకు అన్ని విదాల నేను తోడ్పడతాను,” అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతుంటే, కాంగ్రెస్ పార్టీకి 20 సీట్లకు మించి రావని కేసీఆర్ వారి గాలి తీసేశారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో డిసెంబర్ 3న ఫలితాలు వచ్చినప్పుడు తేలిపోతుంది.