మనిషి రక్తాన్ని శుద్ధి చేసుకోవచ్చునేమో కానీ దాని గ్రూపు (లక్షణాలు) మార్చుకోలేనట్లే, తెలంగాణ కాంగ్రెస్ నేతలను మార్చుకోవచ్చేమో కానీ కీచులాడుకొనే దాని బేసిక్ లక్షణాలు మాత్రం వదిలించుకోలేదు. వరంగల్ కాంగ్రెస్ సమావేశంలో కూడా అదే జరిగింది. జిల్లా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ నేడు ప్రమాణస్వీకారం చేస్తుంటే కొండా సురేఖ వర్గానికి చెందిన సంతోష్ అనే కార్యకర్త లేచి ఈ కార్యక్రమానికి కొండా సురేఖ దంపతులను ఆహ్వానించాలని తెలియదా అంటూ నిలదీశారు. దాంతో ఎర్రబెల్లి స్వర్ణ అనుచరుడైన కట్టస్వామి అతనిపై దాడి చేశాడు. దాంతో ఇరువర్గాలు ఒకరినొకరు పట్టుకొని చొక్కాలు చిరిగిపోయేలా తన్నుకొన్నారు. మద్యలో ఎర్రబెల్లి స్వర్ణ భర్త కూడా బరిలో దిగి కొండా సురేక అనుచరులపై దాడి చేసి ఇక్కడ గొడవ చేస్తే తోలు తీస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. కాసేపు ఇరువర్గాలు తిట్టుకొని, కొట్టుకొన్న తర్వాత అందరూ శాంతించి ఎవరి దారినవారు వెళ్ళిపోయారు. జిల్లాలో కాంగ్రెస్ అధ్యక్షురాలి కళ్లెదుటే ఆమె వర్గం, కొండా సురేఖ వర్గం తన్నుకొంటే, ఇక అందరినీ ఒక్క తాటిపై ఎలా నడిపించగలరు? ఎన్నికలలో ఎలా గెలవగలరు?
Photo and Video Courtecy: ABP Telugu