ఈరోజు ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు అర్వింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ ఇద్దరూ హైదరాబాద్ వచ్చి ప్రగతి భవన్లో సిఎం కేసీఆర్ని కలిశారు. ఢిల్లీ ప్రభుత్వాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన తాజా ఆర్డినెన్స్ గురించి వారు ముగ్గురూ భోజనసమావేశంలో చర్చించారు.
అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ, “ఆనాడు ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జన్సీ అమలుచేయగా, మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం ఎమర్జన్సీని తలపించేవిదంగా ఆర్డినెన్స్లను జారీ చేసి, ప్రజా ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తోంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలను ఢిల్లీలోనే ఆమాద్మీ పార్టీ వరుసగా మూడుసార్లు ఓడించి అధికారంలోకి వచ్చింది. ఎన్నికలలో ఆమాద్మీని ఢీకొని ఓడించలేమని గ్రహించిన మోడీ ప్రభుత్వం, పార్లమెంటులో తనకున్న బలాన్ని దుర్వినియోగిస్తూ ఆర్డినెన్స్లను జారీ చేసి లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తోంది.
మోడీ ప్రభుత్వం ఇదివరకు రైతు వ్యతిరేక చట్టాలను, ప్రజా వ్యతిరేక ఆర్డినెన్స్లను తెచ్చినప్పుడు రైతులు, ప్రజలు ఆందోళనలతో వాటిని ఉపసంహరించుకోవలసి వచ్చింది. అయినా మళ్ళీ ఢిల్లీలో ఆమాద్మీ ప్రభుత్వాన్ని బలహీనపరిచి కూలద్రోయడానికి ఇటువంటి ఆర్డినెన్స్ జారీ చేసింది. మోడీ ప్రభుత్వం దానిని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. లేకుంటే పార్లమెంట్ లోపల బయట పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడానికి వెనకాడము,” అని హెచ్చరించారు.