రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు ఎప్పుడూ చాలా వేడివేడిగా సాగుతుంటాయి. కనుక మద్యలో ఆటవిడుపు చాలా అవసరం. ఆ పని ప్రజాశాంతి పార్టీ కేఏ పాల్ చేస్తుంటారు. మునుగోడు ఉపఎన్నికలలో అందరినీ ఎంతగానో అలరించిన ఆయన తాజాగా తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవ ముహూర్తంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో ప్రజాహిత ప్రయోజన పిటిషన్ వేశారు. తెలంగాణ సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టినప్పుడు ఆయన జన్మించిన ఏప్రిల్ 14న ప్రారంభోత్సవం చేయాలి కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు ఫిభ్రవరి 17న చేయడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. సిఎం కేసీఆర్ ప్రభుత్వ కార్యక్రమాలని తన స్వీయ ప్రచారం కోసం ఈవిదంగా ఉపయోగించుకొంటున్నారని, కనుక ఆరోజున సచివాలయం ప్రారంభోత్సవాన్ని నిలిపివేస్తూ మద్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కేఏ పాల్ హైకోర్టుని అభ్యర్ధించారు. సీఎస్ శాంతికుమారిని, సీఎంవోని ప్రతివాదులుగా కేఏ పాల్ పేర్కొన్నారు. అయితే హైకోర్టు ఆయన పిటిషన్ని ఇంకా విచారణకి స్వీకరించాల్సి ఉంది.