ఈ నెల 13న ప్రధాని నరేంద్రమోడీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేయవలసి ఉండగా ఆయన పర్యటన మళ్ళీ వాయిదా పడిన్నట్లు తెలుస్తోంది. అయితే కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన ఖరారైంది. ఈ నెల 11వ తేదీన అమిత్ షా రానున్నారు. రాష్ట్రంలో అదిలాబాద్, పెద్దపల్లి, నాగర్కర్నూల్, మహబూబ్నగర్ జిల్లాలలో పర్యటించి బిజెపి కార్యక్రమాలలో పాల్గొనబోతున్నారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఫిభ్రవరి నెలాఖరున పార్టీ కార్యక్రమాలలో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు.
ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు తెలంగాణ రాష్ట్రంలో పర్యటనకి వస్తున్న ప్రతీసారి మంత్రులు కేటీఆర్, హరీష్ రావు తదితరులు వారిపై తీవ్ర విమర్శలు చేయడం వారికి రాష్ట్ర బిజెపి నేతలు ఘాటుగా బదులిస్తుండటం పరిపాటిగా మారిపోయింది. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రులు వచ్చి వెళ్ళిన తర్వాత కూడా బిఆర్ఎస్, బిజెపి నేతల మద్య మాటల యుద్ధాలు కొనసాగుతుండటం కూడా పరిపాటిగా మారిపోయింది. ఈసారి కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి మొండి చెయ్యి చూపిందని ఆర్ధికమంత్రి హరీష్రావు కేంద్రంపై నిప్పులు చెరిగారు. ఈ నేపధ్యంలో కేంద్రమంత్రుల రాష్ట్ర పర్యటనలు ఇరుపార్టీల మద్య మరింత అగ్గి రాజేయవచ్చు.