నేడు భారత్ వాయుసేన చరిత్రలో చీకటిరోజు. నేడు ఒకే రోజు వాయుసేనకి చెందిన మూడు యుద్ధ విమానాలు కూలిపోయాయి. వాటిలో రెండు ఫైటర్ జెట్స్ కాగా మరొకటి శిక్షణా విమానం.
రోజువారీ శిక్షణలో భాగంగా ఈరోజు ఉదయం మద్యప్రదేశ్ రాష్ట్రంలో గ్వాలియర్ ఎయిర్ బేస్ నుంచి సుఖోయ్ 30, మిరాజ్-2000 యుద్ధ విమానాలు బయలుదేరాయి. కొద్ది సేపటికే మొరేనా అనే ప్రాంతంలో రెండూ కూలిపోయాయి. రెండు విమానాలు గాలిలో ఒకదానిని మరొకటి ఢీ కొనడం వలన ఈ ప్రమాదం జరిగిన్నట్లు సమాచారం. రెండు విమానాలు కాలి బూడిదైపోయాయి. సమాచారం అందుకొన్న వాయుసేన అధికారులు, సహాయ బృందాలు అక్కడకి చేరుకొన్నారు. కానీ అప్పటికే రెండు విమానాలు కాలి బూడిదైపోయాయి. సుఖోయ్-30 యుద్ధవిమానంలో ఇద్దరు పైలట్లు ప్రాణాలతో బయటపడ్డారు. కానీ మిరాజ్-2000 విమానంలో ఉన్న పైలట్ ఘటనాస్థలంలో కనబడలేదు. అతని కోసం వాయుసేన బృందాలు పరిసర ప్రాంతాలలో గాలిస్తున్నాయి.
రాజస్థాన్లోని భరత్పూర్ ఎయిర్ బేస్ నుంచి ఈరోజు ఉదయం బయలుదేరిన శిక్షణా విమానం కూడా కూలిపోయింది. దాని పైలట్ కోసం గాలింపు కొనసాగుతోంది.
ఈ రెండు ఘటనలపై వాయుసేన చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి విచారణకి ఆదేశించారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్తో కలిసి రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్కి ఈ ఘటనపై వివరణ ఇచ్చారు.