అవును... ట్రై సైకిల్పై నుంచి కిందపడి ఓ వ్యక్తి చనిపోయాడు. నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలోని శివన్నగూడెంకి చెందిన ఫ్లోరోసిస్ బాధితుడు అంశాల స్వామి (32) శనివారం ఉదయం తన ట్రై సైకిల్పై నుంచి కిందకి దిగుతుండగా పడిపోయినప్పుడు తలకి తీవ్రమైన గాయం అయ్యి హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయారు.
ఫ్లోరోసిస్ వ్యాధి సోకడంతో అంశాల స్వామి ఎదుగుదల నిలిచిపోయి మరుగుజ్జుగా ఉండిపోయారు. దాంతో ఉద్యోగం, ఉపాధి దొరకక అష్టకష్టాలు అనుభవించారు. ఆయన సమస్య మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్ళడంతో ఆయనకి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పించి, జీవనోపాది కోసం సెలూన్ కూడా ఏర్పాటు చేసి ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఆయన ఇంటికి వెళ్ళి కలిసి భోజనం చేశారు కూడా.
అంశాల స్వామి ప్రమాదవశాత్తు మరణించారని తెలుసుకొన్న మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో వేదికగా స్పందిస్తూ, “అంశాల స్వామిగారి మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. ఫ్లోరోసిస్ సమస్యపై ఆయన చేసిన పోరాటం చాలా స్పూర్తిదాయకం. ఆయన నా మనసులో ఎప్పటికీ ఉంటారు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకొంటున్నాను,” అంటూ అంశాల స్వామి ఇంట్లో భోజనం చేస్తున్న ఫోటోని షేర్ చేశారు.