సిఎం కేసీఆర్ ఊహించినట్లుగానే ఈడీ అధికారులు టిఆర్ఎస్ పార్టీ వరకు వచ్చేశారు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో హైదరాబాద్లో మూడుసార్లు సోదాలు నిర్వహించి పలువురిని విచారించిన ఈడీ అధికారులు, నిన్న ఇబ్రహీంపట్నం టిఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి నోటీసు పంపించి, ఈరోజు ఉదయం 11 గంటల నుంచి హైదరాబాద్లోని తమ కార్యాలయంలో ప్రశ్నిస్తున్నారు. ఫెమా నిబందనల ఉల్లంఘించి ఆర్ధికలావాదేవీలు జరిపారనే అభియోగంతో ఆయనకు నోటీసు ఇచ్చి విచారిస్తున్నారు. దీనికి సంబందించి పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది.
టిఆర్ఎస్పై ఒత్తిడి పెంచి ఎమ్మెల్యేలలో చీలికలు తెచ్చి తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు లేదా ఎమ్మెల్యేలను బిజెపిలోకి ఫిరాయింపజేసుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం టిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలపైకి ఐటి,ఈడీ, సీబీఐలను ఉసిగొల్పవచ్చని సిఎం కేసీఆర్ ముందే జోస్యం చెప్పారు. బహుశః అదే ఇప్పుడు జరుగబోతోందని భావించవచ్చు.