ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధిగా ద్రౌపది ముర్ము ఈరోజు నామినేషన్ వేశారు. ముందుగా పార్లమెంటు ఆవరణలో మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బిర్సా ముండా విగ్రహాల వద్ద నివాళులు అర్పించారు. అనంతరం పార్లమెంటులో రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డాతో సహా బిజెపి రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. వారితో పాటు ఆమెకు మద్దతు తెలుపుతూ బిజెపి, ఎన్డీయే కూటమికి చెందిన పలువురు ఎంపీలు, వైసీపీ ఎంపీలు విజయసాయి రెడ్డి, మిధున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ముర్ము తరపున బిజెపి నాలుగు సెట్ల నామినేషన్లను సిద్దం చేయగా వాటిపై ప్రధాని నరేంద్రమోడీతో సహా కేంద్రహోంమంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డాలు సంతకాలు చేశారు.
కాంగ్రెస్ మిత్ర పక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్ధిగా ముర్ముపై పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హా ఈనెల 27వ తేదీన నామినేషన్ వేయనున్నారు. కనుక ఆయనకి కూడా కేంద్రప్రభుత్వం జెడ్ ప్లస్ భద్రత కల్పించింది. ఒకవేళ ఆయన బరిలో లేకుంటే నేడే ద్రౌపది ముర్ము ఏకగ్రీవంగా రాష్ట్రపతిగా ఎన్నికైనట్లు ప్రకటించి ఉండేవారు.
ఈ నెల 20వ తేదీన విడుదల కాబోతోంది. ఆయన బరిలో ఉన్నందున జూలై 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతాయి. జూలై 21వ తేదీన ఓట్ల విలువ లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. ద్రౌపది ముర్ముకి ఇప్పటికే అవసరమైన ఓట్ల కంటే చాలా ఎక్కువ శాతం మద్దతు లభించింది. కనుక ఆమె రాష్ట్రపతిగా ఎన్నికవడం కేవలం లాంఛనప్రాయమే.