ఇదివరకు విజయవాడలో లోన్ యాప్ నిర్వాహకుల నిర్వాకాల గురించి విన్నాము కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా లోన్ యాప్ నిర్వాహకుల వేధింపుల కేసులు బయటపడుతుండటం చాలా ఆందోళన కలిగిస్తోంది. తాజాగా జగిత్యాల జిల్లాలో ఓ వివాహిత లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకొంది.
తాజా వివరాల ప్రకారం, గోపాల్వాడకు చెందిన కళ్యాణి (36) అనే మహిళ తన గృహావసరాల కోసం కొన్ని నెలల క్రితం కేవలం రూ.5,000 అప్పు తీసుకొంది. ఆమె ఇప్పటికే దఫాదఫాలుగా సుమారు 10-15 వేల రూపాయల వరకు చెల్లించింది కూడా. అయినా అప్పు తీరలేదు ఇంకా కట్టాలంటూ లోన్ యాప్ నిర్వాహకుడు రోజూ ఆమెను ఫోన్లో వేధిస్తూనే ఉన్నాడు. అంతే కాదు...లోన్ తీసుకొన్నప్పుడు ఆమె ఇచ్చిన ఫోటోను మార్ఫింగ్ చేసి నగ్న చిత్రాలుగా మార్చి ఆమెకు పంపించడం ప్రారంభించారు. దీంతో చాలా కుమిలిపోయిన కళ్యాణి ఇదే విషయం సూసైడ్ నోట్లో స్పష్టంగా వ్రాసి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొంది.
ఆమె ఆత్మహత్య చేసుకొన్న తరువాత లోన్ యాప్ నిర్వాహకుడు ఫోన్ చేసాడు. అప్పుడు అక్కడే ఉన్న కళ్యాణి సోదరుడు అతనికి ఈ విషయం చెప్పగా, “ఆమె నిజంగా చనిపోయిందా?ఆమె చనిపోతే నువ్వేందుకు ఏడ్వడం లేదు. ఆమె డెడ్ బాడీ ఫోటో పంపించు,” అంటూ చాలా దారుణంగా మాట్లాడాడు.
ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని లోన్ యాప్ నిర్వాహకుడి కోసం గాలింపు మొదలుపెట్టారు.