టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుల పేరు ఖరారు
తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలకు సిఎం కేసీఆర్ ఈరోజు సాయంత్రం అభ్యర్ధులను ఖరారు చేశారు. హెటిరో డ్రగ్స్ కంపెనీ అధినేత డాక్టర్ బండి పార్ధసారధి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి), నమస్తే తెలంగాణ దినపత్రిక ఎండీ దీవకొండ దామోదర్ రావుల పేర్లు ఖరారు చేశారు.
రాజ్యసభ్యులుగా కొనసాగుతున్న కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డి.శ్రీనివాసరావుల పదవీకాలం ఈ ఏడాది జూన్ 29తో ముగుస్తుండగా, టిఆర్ఎస్ నేత బండా ప్రకాష్ గత ఏడాది డిసెంబర్లో ఎమ్మెల్సీగా ఎన్నికవడంతో తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఖాళీ అయిన ఆ స్థానంలో దీవకొండ దామోదర్ రావు పేరును ఖరారు చేశారు.
ఎమ్మెల్యేల ఓట్లతో రాజ్యసభ సభ్యులు ఎన్నికవుతారు కనుక వారి ఎన్నిక లాంఛనప్రాయమే. కనుక వారి స్థానంలో వీరు ముగ్గురూ రాజ్యసభలో అడుగుపెట్టబోతున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలలో ఖాళీ కాబోతున్న 57 రాజ్యసభ స్థానాలకు జూన్ 10వ తేదీన ఎన్నికలు జరుగబోతున్నాయి.
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్:
నోటిఫికేషన్ జారీ: మే 24; నామినేషన్ల స్వీకరణకు గడువు: మే 31; నామినేషన్ల పరిశీలన: జూన్ 1; నామినేషన్ల ఉపసంహరణకు గడువు: జూన్ 3;
పోలింగ్: జూన్ 10వ తేదీ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు.
ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన: జూన్ 10వ తేదీ సాయంత్రం 5 నుంచి ఫలితాలు ప్రకటించే వరకు.