రంగారెడ్డి జిల్లాలోని స్థానిక సంస్థల రెండు ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియలో టిఆర్ఎస్ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. పంచాయతీరాజ్ చాంబర్స్ ఫోరం అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి, ఆయన సతీమణి చింపుల శైలజారెడ్డి ఇద్దరూ స్వతంత్ర అభ్యర్ధులుగా నామినేషన్లు వేసేందుకురాగా అధికార టిఆర్ఎస్ నేతలు వారి చేతుల్లోంచి బలవంతంగా నామినేషన్ పత్రాలు లాక్కొని చించివేసి నామినేషన్లు వేయకుండా అడ్డుకొన్నారు. దీనిపై వారిరువురూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్, రిటర్నింగ్ అధికారి ఆమేయ్ కుమార్లకు ఫిర్యాదు చేశారు. తమను నామినేషన్లు వేయకుండా అడ్డుకొని పత్రాలను చించివేసిన టిఆర్ఎస్ నేతలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, రెండు స్థానాలకు ఎన్నికలను రద్దు చేసి మళ్ళీ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించాలని వారు వినతిపత్రాలు ఇచ్చారు. ఒకవేళ ఎన్నికల సంఘం స్పందించకపోతే కేంద్ర ఎన్నికల కమీషన్కు ఫిర్యాదు చేస్తామని, హైకోర్టును కూడా ఆశ్రయిస్తామని తెలిపారు.