ఉమ్మడి నిజామాబాద్ స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసిన కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్, బిజెపిలకు స్థానిక సంస్థలలో బలం లేకపోవడంతో రెండు పార్టీలు పోటీకి దూరంగా ఉండిపోయాయి. శ్రీనివాస్ అనే స్వతంత్ర అభ్యర్ధి నామినేషన్ దాఖలు చేసినప్పటికీ అఫిడవిట్లో కొన్ని తప్పులు ఉండటంతో ఆయన నామినేషన్ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. రేపు (26న) గడువులోగా వేరెవరూ నామినేషన్లు వేయకపోతే కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ప్రకటిస్తారు.
ఇక రంగారెడ్డి జిల్లాలోని రెండు స్థానాలకు టిఆర్ఎస్ తరపున నామినేషన్లు వేసిన పట్నం మహేందర్ రెడ్డి, శంభీపూర్ రాజు కూడా ఇదేవిదంగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ స్వతంత్ర అభ్యర్ధిగా చాలిక చంద్రశేఖర్ నామినేషన్ వేశాడు. కానీ దానిలో కొన్ని తప్పులు ఉండటంతో నామినేషన్ను తిరస్కరించారు. పంచాయతీరాజ్ ఛాంబర్స్ ఫోరం అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి, ఆయన సతీమణి చింపుల శైలజారెడ్డి ఇద్దరూ స్వతంత్ర అభ్యర్ధులుగా నామినేషన్లు వేసేందుకురాగా అధికార టిఆర్ఎస్ కార్యకర్తలు వారిని అడ్డుకొని నామినేషన్ పత్రాలు లాక్కొని చించేసి నామినేషన్లు వేయకుండా అడ్డుకొన్నారు. కనుక బరిలో టిఆర్ఎస్ అభ్యర్ధులు ఇద్దరే మిగిలారు. రేపు (26న) గడువులోగా వేరెవరూ నామినేషన్లు వేయకపోతే వీరిద్దరూ గెలిచినట్లు అధికారికంగా ప్రకటిస్తారు.