రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోమారు సిఎం కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. ధాన్యం కొనుగోలు సమస్యపై కాంగ్రెస్ అధ్వర్యంలో ‘కల్లాలోకి కాంగ్రెస్’ పేరుతో గ్రామాలకు వెళ్ళి రైతులను కలుస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఇక్కడ కల్లాలలో రైతులు ధాన్యం కుప్పలు పోసుకొని వర్షానికి తడిసి మోసులొస్తున్నాయని బాధపడుతుంటే సిఎం కేసీఆర్ ముందు ఆ ధాన్యం కొనకుండా ఢిల్లీ వెళ్ళి యాసంగిలో పండే ధాన్యం కొంటారా లేదా? అని కేంద్రప్రభుత్వాన్ని అడుగుతుండటం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈ సమయంలో సిఎం కేసీఆర్ ఢిల్లీలొ కూర్చొని ఏమి చేస్తున్నారు?అంటే బిజెపితో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొంటున్నారని చెప్పాల్సి ఉంటుంది. టిఆర్ఎస్, బిజెపిలు కలిసి ఆడుతున్న ఈ డ్రామాలో వరి రైతులు నలిగిపోతున్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం, ఇక్కడ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వమూ రెండూ కూడా రైతుల విశ్వాసాన్ని కోల్పోయాయి. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం కల్లాలలో తడుస్తున్న ధాన్యం కొనాలని కాంగ్రెస్ పార్టీ తరపున నేను డిమాండ్ చేస్తున్నాను లేకుంటే రైతులతో కలిసి మా పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తాము,” అని అన్నారు.