హుజూరాబాద్ ఉపఎన్నికకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారం మరింత జోరందుకొంది. టిఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణీదేవి గురువారం హుజూరాబాద్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఆనాడు మా తండ్రిగారు పీవీ నరసింహారావు చేపట్టిన సంస్కరణలనే నేడు యావత్ దేశంలో అమలవుతున్నాయి. అదేవిదంగా తెలంగాణ సిఎం కేసీఆర్ చేపట్టిన సంస్కరణలతో ఈ ఏడేళ్ళలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తోంది. సిఎం కేసీఆర్ గట్టిగా పట్టుబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా నీళ్ళతో, పాడిపంటలతో పచ్చగా కనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం రైతులకు నిరంతరం ఉచిత విద్యుత్ అందిస్తూ, రైతుబంధు వంటి అనేక పధకాలు విజయవంతంగా అమలుచేస్తోంది. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేక ప్రతిపక్షాలు ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయి. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టిన ఈటల రాజేందర్కు ఎందుకు ఓటు వేయాలో ప్రజలు ఆలోచించుకోవాలి. రాష్ట్రాభివృద్ధిని వ్యతిరేకిస్తున్న కలుపు మొక్కల వంటివారిని ఏరి పడేయాలి. గెల్లు శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన వ్యక్తి. అతనిని గెలిపించుకొంటే నియోజకవర్గం అభివృద్ధి చేస్తారు కనుక ప్రజలు ఆయనకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.