ఈనెల 25న టిఆర్ఎస్‌ అధ్యక్షుడి ఎన్నిక: కేటీఆర్‌

October 13, 2021


img

తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ బుదవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “పార్టీ నిబందనల ప్రకారం ప్రతీ రెండేళ్లకోసారి పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకొంటాము. కనుక ఈ నెల 25న ఆ కార్యక్రమం ఉంటుంది. దీని కోసం ఈ నెల 17 నుంచి 22 వరకు నామినేషన్లు స్వీకరిస్తాము. మర్నాడు అంటే 23న నామినేషన్ల పరిశీలన, 24న ఉపసంహరణ, 25న అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది. దీంతో పార్టీ అంతర్గత నిర్మాణం పూర్తవుతుంది కనుక వచ్చే నెల 15వ తేదీన వరంగల్‌లో ‘తెలంగాణ విజయ గర్జన’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తాము. దాని కోసం ఈనెల 27 నుంచే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలో సన్నాహక సభలు నిర్వహిస్తాము,” అని తెలిపారు. 

టిఆర్ఎస్‌లో కేసీఆర్‌కు పోటీగా ఎవరూ నామినేషన్లు వేయరు కనుక ఈ ఎన్నిక కేవలం లాంఛనప్రాయమే అని వేరే చెప్పక్కరలేదు. అయితే వచ్చే నెల 15న వరంగల్‌లో జరుగబోయే బహిరంగ సభతో రాష్ట్రంలో మళ్ళీ టిఆర్ఎస్‌ హడావుడి మళ్ళీ మొదలవుతుంది. అప్పటికి హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఫలితాలు కూడా వచ్చేస్తాయి కనుక ఆ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌ విజయమ్స్ సాధిస్తే టిఆర్ఎస్‌ మరింత ఉత్సాహంగా సభను నిర్వహిస్తుంది.       



Related Post