రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్కు కరోనా సోకింది. గత రెండు నెలలుగా గంగుల మంత్రి హరీష్ రావుతో కలిసి హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిత్యం వందలాది మంది పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు కలుస్తున్నారు. బహుశః వారిలో ఎవరి ద్వారానో మంత్రి గంగులకు కరోనా సోకి ఉండవచ్చు. గత రెండు రోజులుగా స్వల్పంగా జలుబు, జ్వరం వస్తుండటంతో గంగుల పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. వైద్యుల సూచన మేరకు ఆయన హోమ్ క్వారెంటైన్లో ఉంటున్నారు. ఇటీవల తనను కలిసిన వారందరూ కరోనా లక్షణాలు కనపడితే అశ్రద్ద చేయకుండా పరీక్ష చేయించుకొని చికిత్స తీసుకోవాలని మంత్రి గంగుల విజ్ఞప్తి చేశారు.