వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడు గోవాలో అరెస్ట్

August 03, 2021


img

ఏపీలో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద హత్య కేసును విచారణ జరుపుతున్న సిబిఐ అధికారులు సోమవారం సునీల్ కుమార్‌ యాదవ్ అనే వ్యక్తిని గోవాలో అరెస్ట్ చేసి కడపకు తీసుకువచ్చారు. వివేకా హత్య కేసులో సిబిఐ అధికారులు సునీల్ కుమార్‌ యాదవ్‌ను కూడా ఇదివరకు ప్రశ్నించారు. కానీ తరువాత అతను గోవా పారిపోవడంతో సిబిఐ అధికారులు అక్కడకు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకువచ్చారు. గత రెండు నెలలుగా ఈ కేసుపై విచారణ జరుపుతున్న సిబిఐ అధికారులు వైఎస్ వివేకానంద కుటుంబానికి సన్నిహితులైన ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ అనే ఇద్దరు వ్యక్తులతో పాటు కడప జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న మరి కొందరు నిందితులను ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది ఏపీలో శాసనసభ ఎన్నికలకు ముందు వివేకా తన నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు. వివేకా సాక్షాత్ ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డికి చిన్నాన్న అయినప్పటికీ ఇతర కేసుల్లాగే దీని విచారణ కూడా చాలా మెల్లగా సాగుతుండటం విశేషం. 



Related Post