సిఎం కేసీఆర్ ముందుగా ఖరారు చేసిన షెడ్యూల్ ప్రకారమే ఆదివారం సిద్ధిపేట, కామారెడ్డి జిల్లాలలో పర్యటించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో సిద్ధిపేట చేరుకొని అక్కడ కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టర్ కార్యాలయం, పోలీస్ కమీషనరేట్ కార్యాలయాలను ప్రారంభోత్సవం చేశారు.
సిద్ధిపేటలో కలెక్టర్ కార్యాలయం ప్రారంభించిన తరువాత జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డిని స్వయంగా కుర్చీలో కూర్చోబెట్టారు. ఆయన హటాత్తుగా సిఎం కేసీఆర్ కాళ్ళకు మొక్కడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే తాను సిఎం కేసీఆర్ను తండ్రిగా భావిస్తున్నందున నేడు ఫాదర్స్ డే కావడంతో సిఎం కేసీఆర్ ఆశీర్వాదం కోరి కాళ్ళకు మొక్కానని కలెక్టర్ వెంకటరామరెడ్డి అన్నారు.
సిద్ధిపేట పర్యటన సందర్భంగా సిఎం కేసీఆర్ జిల్లాతో సహా వరంగల్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాలకు కొత్తగా పశువైద్యశాలలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
అనంతరం కామారెడ్డికి వెళ్ళి అక్కడ కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టర్ కార్యాలయం, పోలీస్ కమీషనరేట్ కార్యాలయాలను ప్రారంభోత్సవం చేశారు.
రెండు జిల్లాల్లో జరిగిన ఈ కార్యక్రమాలలో మంత్రులు హరీష్రావు, ప్రశాంత్ రెడ్డి, మహమూద్ ఆలీ, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు, జిల్లాల టిఆర్ఎస్ నేతలు హాజరయ్యారు.