ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా శనివారం మీడియాతో మాట్లాడుతూ, “దేశవ్యాప్తంగా అన్లాక్ మొదలయ్యింది. చాలా రాష్ట్రాలలో లాక్డౌన్ ఆంక్షలు సడలించడంతో ప్రజలు కరోనా మొదటి, రెండో దశలలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను ఏమాత్రం పట్టించుకోకుండా తిరుగుతున్నారు. ఇది థర్డ్ వేవ్ కరోనాకు దారితీయబోతోంది. నా అంచనాల ప్రకారం బహుశః మరో 6 నుంచి 8 వారాలలోగా లేదా మరికొంత ఆలస్యంగా థర్డ్ వేవ్ ప్రారంభం కావచ్చు. కాస్త ఆలస్యమవవచ్చేమో కానీ మళ్ళీ రావడం మాత్రం ఖాయం.
థర్డ్ వేవ్ మొదలైన తరువాత మళ్ళీ దేశమంతటా వ్యాపించడానికి కొంత సమయం పడుతుంది. కనుక కరోనా మొదటి రెండు దశలలో ఎదుర్కొన్న అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఆలోగా అన్ని రాష్ట్రాలు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవడం మంచిది. ఈసారి కరోనా కట్టడికి అన్ని రాష్ట్రాలు జన సమూహాలను ఎంత సమర్ధంగా నివారించగలవనే దానిపై కరోనా వ్యాప్తి, తీవ్రత ఉంటుంది. కరోనా థర్డ్ వేవ్ గురించి ఈసారి ముందే తెలిసింది కనుక ఆలోగా అన్ని రాష్ట్రాలు కరోనా పరీక్షలు, మందులు, సిబ్బంది, చికిత్స, ఆక్సిజన్ తదితర ఏర్పాట్లన్నీ చేసుకోవడం మంచిది,” అని అన్నారు.