తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 5 వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని సిఎం కేసీఆర్ నిర్ణయించారు. సంగారెడ్డి, కొత్తగూడెం, జగిత్యాల,మంచిర్యాల, హబూబాబాద్, వనపర్తి జిల్లాలలో వైద్య కళాశాలలను, వాటికి అనుబందంగా నర్సింగ్ కాలేజీలను కూడా ఏర్పాటు చేయాలని సిఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇప్పటికే ఉన్న వైద్య కళాశాలలో నర్సింగ్ కాలేజీలు లేనిచోట్ల వాటిని వెంటనే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే అనుమతులు పొంది నిర్మాణ దశలో ఉన్న వివిద జిల్లాలలోని వైద్య కళాశాలల నిర్మాణపనులు వేగవంతం చేయాలని సిఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
ఇక ప్రభుత్వాసుపత్రులకు మందులు, అవసరమైన పరికరాలు వేగంగా సరఫరా చేసేందుకుగాను రాష్ట్రంలో కొత్తగా 12 ప్రాంతీయ ఉప కేంద్రాలను (రీజియనల్ సబ్ సెంటర్స్) ఏర్పాటు చేయాలని సిఎం కేసీఆర్ ఆదేశించారు. గద్వాల్, సిద్ధిపేట, సూర్యాపేట, కొత్తగూడెం, భువనగిరి, జగిత్యాల, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్ జిల్లా కేంద్రాలలో వీటిని ఏర్పాటు చేయాలని సిఎం కేసీఆర్ ఆదేశించారు. వీటిలో వాక్సిన్లు, మందులు నిలువ చేసేందుకు తప్పనిసరిగా కోల్డ్ స్టోరేజి సౌకర్యం కూడా కల్పించాలని ఆదేశించారు. ఈ ఉప కేంద్రాల నుండి మందులు, అవసరమైన పరికరాలను జిల్లా ఆసుపత్రులకు తరలించేందుకు అవసరమైన వాహనాలను కూడా ఏర్పాటు చేయాలని సిఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
కేంద్రప్రభుత్వం నుండి వీలైనన్ని ఎక్కువ వ్యాక్సిన్లు రప్పించుకొనేందుకు ప్రయత్నిస్తూనే విదేశాల నుంచి వాక్సిన్ల కొనుగోలుకు గ్లోబల్ టెండర్స్ పిలవాలని అధికారులను ఆదేశించారు.