రైలు ఢీకొనడంతో మహబూబాబాద్‌లో ఇద్దరు ట్రాక్‌మెన్ మృతి

May 07, 2021


img

మహబూబాబాద్‌ రైల్వే స్టేషన్ పరిధిలో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. పాషా, కమలాకరచారి అనే ఇద్దరు ట్రాక్‌మెన్ రైల్వేస్టేషన్‌ సమీపంలో రైల్వే ట్రాక్‌లకు మరమత్తులు చేస్తుండగా, పొరపాటున అదే ట్రాక్‌పైకి వేగంగా ఓ రైలు దూసుకువచ్చి వారిని బలంగా ఢీకొనడంతో ఇద్దరూ ఘటనాస్థలంలోనే మృతి చెందారు. 

రైల్వే ట్రాక్‌పై కార్మికులు మరమత్తు పనులు చేస్తుంటే, ఆ ట్రాక్‌పైకి ఏ రైలు వెళ్ళకుండా నివారించేందుకు సిగ్నలింగ్, రైల్వే భద్రత, రైల్వే ఇంజనీరింగ్ తదితర విభాగాల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తుంటారు. కానీ ఈసారి వారి మద్య ఎక్కడో సమన్వయలోపం జరుగడంతో ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఒకవేళ రైల్వే ట్రాక్‌పై ఎక్కువ మంది పనిచేస్తుంటే వారిలో ఎవరో ఒకరు ఎర్రజెండా పట్టుకొని నిలబడి రైళ్ళ రాకపోకలను గమనిస్తూ ఇటువంటప్పుడు ముందుగా హెచ్చరిస్తుంటారు. కానీ ఈ ప్రమాదం జరిగినప్పుడు వారిద్దరే పనిచేస్తుండటంతో వారు మీదకు దూసుకువస్తున్న రైలును గుర్తించేలోగా ఈ ఘోర ప్రమాదం జరిగిపోయింది. సమాచారం అందుకొన్న పోలీసులు అక్కడకు చేరుకొని కేసు నమోదు చేసుకొని, మృతదేహాలను పోస్టుమార్టం కొరకు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 



Related Post