తెలంగాణలో కరోనా కేసులు పెరిగిపోతున్నందున లాక్డౌన్ విధించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్న నేపధ్యంలో సిఎం కేసీఆర్ నిన్న ప్రగతి భవన్లో వివిద శాఖల ఉన్నతాధికారులతో సమావేశమైనప్పుడు రాష్ట్రంలో ఎట్టి పరిస్థితులలో లాక్డౌన్ విధించబోమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ ఏమన్నారో క్లుప్తంగా...
• గత లాక్డౌన్ నేర్పిన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో మళ్ళీ లాక్డౌన్ విధించకూడదని నిర్ణయించాము.
• కొన్ని రాష్ట్రాలలో లాక్డౌన్ విధించినా కరోనా తీవ్రత తగ్గడం లేదు.
• లాక్డౌన్ విధిస్తే రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది.
• లాక్డౌన్ విధిస్తే రోజువారీ పనులు చేసుకొని బ్రతికేవారు, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారు.
• లాక్డౌన్ విధిస్తే పరిశ్రమలు మూతపడతాయి. వాటిలో పనిచేస్తున్న వేలాదిమంది కార్మికులు, ఉద్యోగులు వారి కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉంటుంది.
• ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 6,144 గ్రామాలలో లక్షల టన్నుల ధాన్యం అమ్మకానికి సిద్దంగా ఉంది. లాక్డౌన్ విధిస్తే ధాన్యం కొనుగోలు నిలిచిపోతుంది. రైతులు తీవ్రంగా నష్టపోతారు.
• లాక్డౌన్ విధిస్తే రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది వలస కార్మికులు ఉపాధి, ఆదాయం కోల్పోయి తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. వారు స్వరాష్ట్రాలకు వెళ్లిపోతే మళ్ళీ వారిని వెనక్కి రప్పించలేము. అంతవరకు పనులు నిలిపోతాయి.
• .ఇది కరోనా సమస్య కనుక తగు చర్యలు చేపట్టి దానిని అధిగమించేందుకు ప్రయత్నిద్దాము.
• రాష్ట్రంలో ప్రజలందరూ కరోనా జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు.
• రాష్ట్రవ్యాప్తంగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఇంటింటి సర్వే చేయించి, కరోనా రోగులను గుర్తిస్తాం.
• కరోనా సోకినవారిని గుర్తించి, హోమ్ ఐసోలేషన్లో ఉన్నవారికి అవసరమైన మందులు అందిస్తాం.
• ఆక్సిజన్ ఉత్పత్తి చేసే యంత్రాలను కొనుగోలు చేసి అన్ని కరోనా ఆసుపత్రులకు అందజేస్తాం.
• వారం రోజులలోగా హైదరాబాద్తో సహా అన్నీ జిల్లాలో 500 బెడ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ.
• చైనా నుంచి ఒక్కోటి కోటి రూపాయలు చొప్పున 12 క్రయోజెనిక్ ట్యాంకర్లను తక్షణమే కొనుగోలుచేసి రప్పిస్తాం.
• రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రులు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో కరోనా రోగుల కోసమే ప్రత్యేకంగా 5,980 అవుట్ పేషెంట్ కేంద్రాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా రోగులకు చికిత్స, మందులు అందజేస్తున్నాం.