నాగార్జునసాగర్ ఉపఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్ కుమార్కు మద్దతుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిన్న తెప్పలమడుగు, లింగంపల్లి తదితర ప్రాంతాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా పనిచేసిన కె.జానారెడ్డి ఏనాడూ తనను గెలిపించిన ప్రజలను, నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. అధికారంలో ఉన్నప్పుడే పట్టించుకొనివాడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేయగలడు? గెలిచినా ఏమి చేయగలడు? అదే...రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ను గెలిపిస్తే నోముల భగత్ కుమార్ సాగర్ నియోజకవర్గం అభివృద్ధి చేస్తాడు. ప్రభుత్వంతో మాట్లాడి ప్రజా సమస్యలను పరిష్కరిస్తాడు. కనుక అతనికే ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.