ప్రభాస్‌ అభిమానులు... కాస్త ఓపిక పట్టండి!

బాహుబలి ప్రభాస్‌ పుట్టినరోజు కానుకగా బుధవారం ‘రాజాసాబ్‌’ నుంచి మోషన్ పోస్టర్‌ విడుదల చేశారు. అయితే అభిమానులు ఊహించిన దానికి భిన్నంగా ప్రభాస్‌ పోస్టర్‌ ఉండటంతో కాస్త నిరాశ చెందారు. రాజాసాబ్‌ తర్వాత ప్రభాస్‌ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ పీరియాడికల్ యాక్షన్ సినిమా చేయబోతున్నారు.

ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ డిసెంబర్‌ నుంచే ప్రారంభం అవుతుందని సమాచారం. కనుక నిన్న ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమాకి సంబందించి అప్‌డేట్‌ తప్పక వస్తుందని ప్రభాస్‌ అభిమానులు ఎదురుచూస్తే ఏమీ రాలేదు.

కానీ ఏమీ రాలేదని నిరాశ చెందవద్దని, మరో మంచి సమయం చూసుకొని తప్పకుండా అప్‌డేట్‌ ఇస్తామని, ఆలోగా రాజాసాబ్‌ కొత్త లుక్స్ చూసి సంతోషపడండి,” అని ఈ సినిమాని నిర్మించబోతున్న మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రభాస్‌ ఫోటోతో ట్వీట్‌ చేసింది. ఈ నెల 31వ తేదీన బహుశః దీపావళి పండుగరోజున ఫస్ట్-లుక్ పోస్టర్‌ విడుదల చేస్తారేమో? చేస్తే సంతోషమే!  

ఇప్పటికే సెప్టెంబర్‌లో ఈ సినిమాకి కొబ్బరికాయ కొట్టేశారు. “ఆధిపత్యం కోసం యుద్ధాలు జరుగుతున్నవేళ, ఒక యోధుడు దేని కోసం యుద్ధం చేయాలో పునర్నిర్వచించాడు. 1940లలో జరిగిన సంఘర్షణే ఈ సినిమా. త్వరలో షూటింగ్‌ మొదలవబోతోంది,” అంటూ ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు. 

బ్రిటిష్ పాలనలో వారి అధీనంలో ఉన్న నేటి రాష్ట్రపతి భవన్‌పై ఫిరంగులతో దాడి చేస్తున్నట్లు చూపారు. ఆ మంటలలో బ్రిటిష్ జెండా, భవనం మంటలలో తగులబడుతున్నట్లు చూపారు. 

ఈ సినిమాలో ప్రభాస్‌ స్వాతంత్ర సమరయోధుడుగా నటించబోతున్నట్లు చెప్పకనే చెప్పేశారు. ప్రభాస్‌కు జోడీగా కొత్త హీరోయిన్‌గా ఇమాన్వీ నటించబోతోంది. అలనాటి అందాల నటి జయప్రద, బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి ముఖ్యపాత్రలు చేయబోతున్నారు. 

ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్‌, యూవీ క్రియేషన్స్ కలిసి రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మించబోతున్నాయి.