మరోసారి పౌరాణిక పాత్రలో ప్రభాస్.. ఈసారి శివుడుగా

ఆదిపురుష్ సినిమా తర్వాత ప్రభాస్ మళ్ళీ పౌరాణిక పాత్ర చేయబోతున్నారంటే అభిమానుల గుండెలు గతుక్కుమంటాయి. మంచువిష్ణు మొదలుపెడుతున్న తాజా చిత్రం భక్త కన్నప్ప సినిమాలో ప్రభాస్ శివుడుగా నటించబోతున్నారు. 

మంచు విష్ణు ఈ విషయం స్వయంగా తెలియజేస్తూ ‘హరహర మహదేవ్’ అంటూ ట్వీట్ చేశాడు. మరో విశేషమేమిటంటే, ఆదిపురుష్‌ సినిమాలో జానకిగా నటించిన కృతి సనన్ సోదరి నుపూర్ సనన్ ఈ సినిమాలో మంచు విష్ణుకు జోడీగా నటించబోతోంది.

స్టార్ ప్లస్ టీవీలో ప్రసారమైన మహాభారత్ హిందీ సీరియల్‌కు దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్‌ సింగ్‌ ఈ భక్త కన్నప్ప సినిమాకు దర్శకుడుగా వ్యవహరించబోతున్నారు. 

ఈ సినిమాను అవా ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కలిసి నిర్మించబోతున్నారు. 

భక్త కన్నప్ప సినిమాకు సంగీతం: మణిశర్మ మరియు స్టీఫెన్ దేవాస్సీ, కెమెరా: షెల్డన్ షావ్, ఆర్ట్ డైరెక్టర్: చిన్న. 

త్వరలో న్యూజిలాండ్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి సింగిల్ షెడ్యూల్లో పూర్తిచేస్తామని మంచు విష్ణు చెప్పారు.