పలాసా దర్శకుడితో వరుణ్ తేజ్ మట్కా!

వరుణ్ తేజ్ ప్రస్తుతం ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ‘గాంధీవధారి అర్జున’ అనే సినిమాను చేస్తున్నాడు. దాని తర్వాత ‘పలాస’ దర్శకుడు కరుణకుమార్‌తో కలిసి సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు ‘మట్కా’ అని టైటిల్‌ పోస్టర్‌ విడుదల చేశారు. దానిలో కరెన్సీ నోటు బ్యాక్‌గ్రౌండ్‌లో రూపాయి నాణెంపై ఉన్న ఓ వింటేజ్ కారుని చూపించారు. 1975లో ముద్రించిన రూపాయి నాణేన్ని చూపడం ద్వారా ఆ రోజుల్లో దేశవ్యాప్తంగా జోరుగా సాగిన ‘మట్కా జూదం’ కధాంశంగా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు భావించవచ్చు. అయితే యాక్షన్ హీరోగా పేరుతెచ్చుకొంటున్న వరుణ్ తేజ్ అటువంటి పీరియాడికల్ మూవీలో ఏం పాత్ర చేస్తాడనేది ఊహకందని విషయమే. 

ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించబోతోంది. జీవీ ప్రకాష్ కుమార్‌ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నారు. ఈ సినిమాను వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి, డా. విజేందర్ రెడ్డి తీగల కలిసి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం,హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు.