
వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘ఛలో’ సినిమాతో రష్మిక మందన తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత నితిన్, రష్మిక మందన హీరో హీరోయిన్లుగా భీష్మ తీస్తే అదీ హిట్ అయ్యింది. అప్పటి నుంచి మరి వెనుతిరిగి చూసుకోవలసిన అవసరమే ఏర్పడలేదు.
మళ్ళీ వారిద్దరి కాంబినేషన్లో మైత్రీ మూవీ మేకర్స్ ఇటీవల ఓ సినిమా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి చేత క్లాప్ కొట్టించి ప్రారంభించారు. అయితే ఈ సినిమా ఇంకా ప్రారంభం కాక మునుపే రష్మిక మందన తప్పుకొంది.
ఆమె ప్రస్తుతం పుష్ప-2, రెయిన్ బో సినిమాలు చేస్తోంది. ఆమె చేతిలో మరో మూడు హిందీ సినిమాలు కూడా ఉన్నాయి. కనుక నితిన్తో సినిమాకి డేట్స్ అడ్జస్ట్ అవడం లేదంటూ సినిమా నుంచి తప్పుకొంది. అయితే ఆమె నిజంగానే చాలా బిజీగా ఉందని వెంకీ కుడుములకు కూడా తెలుసు.
అలాగని ఆమె కోసం సినిమా ఆపుకొని ఎదురుచూస్తూ కూర్చోలేరు కనుక తన అభిమాన హీరోయిన్ స్థానంలో మరో కొత్త హీరోయిన్ కోసం వెతుకులాట మొదలుపెట్టారు. టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె కూడా ముగ్గురు పెద్ద హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉంది. కనుక రష్మిక మందన స్థానంలో ఎవరోస్తారో చూడాలి.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, కెమెరా: సాయి శ్రీరామ్ అందిస్తున్నారు.