నాడు ఎన్టీఆర్‌తో శ్రీదేవి... నేడు జూనియర్‌తో జాన్వీ!

కొరటాల శివ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్‌ 30వ చిత్రంలో హీరోయిన్‌ ఎవరనే సస్పెన్స్ వీడింది. అలనాటి అందాల నటి శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్ ఈ సినిమాలో జూ.ఎన్టీఆర్‌కి జోడీగా నటించబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించి, ఈ సినిమాలో ఆమె ఫస్ట్-లుక్‌ పోస్టరును కూడా సోషల్ మీడియాలో విడుదల చేసింది. 

ఆనాడు బడిపంతులు సినిమాలో నందమూరి తారకరామారావుకి మనుమరాలుగా నటించిన శ్రీదేవి, ఆ తర్వాత అనేక సినిమాలలో ఆయనకు హీరోయిన్‌గా నటించింది. ఇప్పుడు ఆయన మనుమడు జూ.ఎన్టీఆర్‌కు జోడీగా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తుండటం విశేషం. మరో విశేషమేమిటంటే, ఈ సినిమాతోనే ఆమె తొలిసారిగా తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టబోతోంది. 

జాన్వీ కపూర్ కూడా స్పందిస్తూ, “జూ.ఎన్టీఆర్‌ నటన అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని నేను ఇదివరకే చెప్పాను. నా కల ఇన్నాళ్ళకు ఈ సినిమాతో నెరవేరబోతోంది,” అని జాన్వీ ట్వీట్‌ చేసింది. 

ఇక ఈ సినిమా విషయానికి వస్తే, దీనిని నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ సినిమా కోసం నిర్మాత బండ్ల గణేశ్ రిజిస్టర్ చేసుకొన్న ‘దేవర’ టైటిల్ ఈ సినిమాకి ఇచ్చిన్నట్లు సమాచారం కానీ ఈ వార్తని ఖరారు చేయవలసి ఉంది.   

ఈ సినిమాకు కెమెరా: రత్నవేలు, సంగీతం: అనిరుధ్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: సాబు సిరిల్ అందించబోతున్నారు.