మహేష్ మళ్ళీ మొదలెట్టేశాడు.. ఎవరెస్ట్ మసాలాతో

సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి చనిపోవడంతో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో చేస్తున్న సినిమా షూటింగ్ అర్దాంతరంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. మొన్న ఆదివారమే ఆమె దశదిన ఖర్మ కూడా పూర్తయింది. కనుక రెండో షెడ్యూల్ షూటింగ్ మొదలుపెట్టేందుకు  మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ నెల 20,21 తేదీల నుంచి మొదలుపెట్టేందుకు త్రివిక్రమ్ ఏర్పాట్లు చేసుకొంటున్నారు. ఈలోగా మహేష్ బాబు ఎవరెస్ట్ మసాలా కోసం ఓ వ్యాపార ప్రకటన చేస్తున్నాడు. ఇవాళ్ళ బుదవారం జూబ్లీహిల్స్‌లో ఓ స్టూడియోలో ఈ వ్యాపార ప్రకటన షూటింగులో మహేష్ బాబు పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. దీని షూటింగ్‌ కోసం ముంబై నుంచి ఓ యాడ్ ఏజన్సీ బృందం నిన్ననే హైదరాబాద్‌ చేరుకొంది. కనుక మహేష్ బాబు మళ్ళీ షూటింగ్‌లకు సిద్దమైనట్లే భావించవచ్చు.

 మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల మహేష్ బాబుకి జోడీగా నటిస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా పేరు ఖరారు చేయలేదు కనుక అంతవరకు #MB28గానే పరిగణిస్తున్నారు.

దీనిని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం ఎస్.తమన్, కెమెరా: పిఎస్ వినోద్, ఎడిటింగ్ నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టరుగా ఏఎస్ ప్రకాష్ పనిచేస్తున్నారు.