మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా నటించిన గాడ్ ఫాదర్ చిత్రం రేపు (అక్టోబర్ 5) విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిరంజీవి, దర్శక నిర్మాతలు హైదరాబాద్లో ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు చిరంజీవి సమాధానాలు చెప్పారు.
ప్రశ్న: మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసీఫర్ చిత్రానికి ఇది రీమేక్ అయినప్పుడు మళ్ళీ ఈ సినిమాను మలయాళంలో ఎందుకు రిలీజ్ చేస్తున్నారు?
జవాబు: నాకు తెలిసి గాడ్ ఫాదర్ మలయాళంలో రిలీజ్ చేయడం లేదు.. అంటూ నిర్మాతలని అడిగి మళ్ళీ ధృవీకరించుకొన్నారు. కొన్ని రోజుల తర్వాత ఈ సినిమాను తమిళంలో రిలీజ్ చేయబోతున్నామని చిరంజీవి చెప్పారు.
ప్రశ్న: మన తెలుగు సినీ పరిశ్రమ ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. అన్ని సొంతకధలతో తీస్తున్న సినిమాలే. కానీ మీరేందుకు రీమేక్ సినిమాలకు మొగ్గు చూపుతున్నారు?అప్పుడు మీ సినిమాలని ఒరిజినల్ వెర్షన్తో పోల్చి చూస్తుంటారు కదా?
జవాబు: అసలు ‘రీమేక్ సినిమా’ అంటే మన అందరికీ చిన్న చూపు ఎందుకు? నిజానికి రీమేక్ సినిమాను సక్సస్ చేయడమే చాలా కష్టం. అవును. రీమేక్ సినిమాను ఒరిజినల్ వెర్షన్తో పోల్చి చూస్తారు. అప్పుడే నేను దాని కంటే గొప్పగా చేశాను అని నిరూపించుకోగలుగుతాను కదా అన్నారు.
ప్రశ్న: ఈ రెండు మూడు నెలల్లో మీరు వివిద సందర్భాలలో వివిద పార్టీల నేతలను కలిశారు. కనుక మళ్ళీ మీరు రాజకీయాలలోకి రాబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది నిజమేనా?వస్తే ఏ పార్టీలో చేరుతారు?
జవాబు: ఈ ఊహాగానాలన్నీ ఎవరు చేస్తున్నారో కానీ వారిలో చాలా క్రియేటివిటీ ఉంది. ఇటువంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీలోకి వస్తే మంచి మంచి కధలు అందించగలుగుతారు. నేను ఏ పార్టీలోను చేరడం లేదని చిరంజీవి అన్నారు.
ప్రశ్న: మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీకి మద్దతు ఇస్తారా?
జవాబు: వాడు నా తమ్ముడు. చిన్నప్పటి నుంచి నేను వాడ్ని గమనిస్తూనే ఉన్నాను. వాడిలో నిజయతీ, నిబద్దత నేటికీ మారలేదు. అటువంటివాడు నాయకుడు మన రాష్ట్రానికి కావాలి. ప్రజలు వాడిని ఆదరిస్తారనే అనుకొంటున్నాను. భవిష్యత్లో వాడు ఏ స్థాయికి ఎదుగుతాడో నాకు తెలియదు కానీ వాడికి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది అని చిరంజీవి అన్నారు.
(Courtesy TV9)