ప్రముఖ నటుడు విద్యాసాగర్ మృతి

ప్రముఖ తెలుగు నటుడు విద్యాసాగర్ (73) ఆదివారం హైదరాబాద్‌లో తన నివాసంలో కనుమూశారు. వందకు పైగా సినిమాలలో చేసిన తర్వాత అవకాశాలు తగ్గడంతో ఇంట్లోనే ఉంటున్నారు. కొంతకాలం క్రితం పక్షవాతానికి గురవడంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. నిన్న ఆయన ఆరోగ్యం విషమించడంతో కనుమూశారు. విద్యాసాగర్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోమవారం హైదరాబాద్‌లో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు చెప్పారు.  

సినీ పరిశ్రమలో ప్రవేశించిన తర్వాత ప్రముఖ దర్శకుడు జంద్యాల తీసిన అనేక సినిమాలలో విద్యాసాగర్ నటించారు. విద్యాసాగర్ నటన చూసి ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ కూడా అవకాశాలు ఇచ్చారు. ఇద్దరు ప్రముఖ దర్శకుల అండదండలు లభించడంతో విద్యాసాగర్ వందకు పైగా సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్, కమెడియన్‌గా పలు పాత్రలలో నటించారు. ఈ చదువులు మాకొద్దుచిత్రంలో విద్యాసాగర్‌ హీరోగా చేశారు. అహ నా పెళ్లంట, శ్రీవారికి ప్రేమలేఖ, మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, స్వాతిముత్యం, బొబ్బిలి రాజా వంటి సినిమాలలో ఆయనకు మంచిపేరు వచ్చింది. విద్యాసాగర్ సినిమాలు చేస్తూనే నాటకాలలో నటిస్తూ వాటి దర్శకత్వం కూడా చేశారు.