
తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్న నటి సాయి పల్లవి, ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉంటుంది. అయితే ఇప్పుడు కోర్టు చుట్టూ తిరగాల్సివస్తోంది. మతం పేరుతో ఎవరినీ వేధించడం సరికాదని ఆమె చెప్పిన మాటలే ఆమె మెడకి చుట్టుకొన్నాయి.
ఓ తాజా ఇంటర్వ్యూలో ఆమె ఈ అంశంపై స్పందిస్తూ, “కాశ్మీరీ ఫైల్స్ చిత్రం చూసినప్పుడు దానిలో కాశ్మీరీ పండిట్లు పడిన బాధలు చూసి నేను చాలా చలించిపోయాను. అదేవిదంగా గోరక్షకుల పేరుతో ఎవరినీ వేధించడం సరికాదని భావిస్తున్నాను,” అని అన్నారు. ఈ మాటలే వివాదస్పదమయ్యాయి.
ఆమె వ్యాఖ్యలపై హైదరాబాద్లో హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సుల్తాన్ బజార్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో, ఆ కేసు కోర్టుకి వెళ్ళింది.
సాయి పల్లవి వెంటనే స్పందిస్తూ, “నేను ఎవరినీ బాధపెట్టాలనే ఉద్దేశ్యంతో ఆ మాటలు అనలేదు. కులం, మతం పేరుతో ఎవరూ వేదింపులకు పాల్పడటం సరికాదని మాత్రమే చెప్పాలనుకొన్నాను. కానీ నా మాటల వలన కొందరు బాధపడ్డారని తెలుసుకోగానే మళ్ళీ మీడియా ముందుకు వచ్చి క్షమాపణలు కోరుతున్నాను,” అని వివరణతో పాటు క్షమాపణలు కూడా చెప్పుకొన్నారు.
ఆ కేసు హైకోర్టుకి వెళ్ళడంతో దానిని కొట్టివేయవలసింది అభ్యర్ధిస్తూ ఆమె పిటిషన్ వేశారు. కానీ హైకోర్టు ఆమె పిటిషన్ను తిరస్కరించింది. కనుక సాయి పల్లవి ఈ కేసు విచారణకు హాజరు కావలసిరావచ్చు.