
నాగ చైతన్య నుంచి విడిపోయిన తరువాత సమంత కొంత కాలం మానసికంగా క్రుంగిపోయినప్పటికీ చాలా తక్కువ సమయంలోనే పూర్తిగా కోలుకొని వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. నాగ చైతన్యతో విడిపోయిన తరువాత ఆమె పుష్పలో అల్లు అర్జున్తో కలిసి “ఊ అంటావా మావా... ఉఊ అంటావా మావ... అంటూ చేసిన ఐటెమ్ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది.
ఆ తరువాత గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం చేస్తోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. అయితే విజువల్ గ్రాఫిక్స్ కోసం మరికొన్ని నెలలు పట్టవచ్చని తెలుస్తోంది. కనుక ఈ సినిమా ఇంకా ఎప్పుడు విడుదలవుతుందో తెలియవలసి ఉంది.
దాంతో పాటు హరి, హరీష్ దర్శకత్వంలో యశోదా సినిమా చేస్తోంది. ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ శ్రీదేవీ మూవీస్ బ్యానర్పై నిర్మిస్తున్న యశోద ఆగస్ట్ 12న విడుదల కాబోతోంది.
ఈ రెండు కాక శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండతో కలిసి ఖుషీ సినిమా చేస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 23న విడుదల కాబోతోంది.
వీటి తరువాత సమంత తమిళంలో మరోసారి విజయ్కి జోడీగా నటించబోతోంది. లోకేష్ కనగరాజ్ దర్శత్వంలో ఈ సినిమా ఈ ఏడాది చివరిలోగా సెట్స్ మీదకు వెళుతుంది. ఇంతకు ముందు సమంత కత్తి, తేరి,మెర్సల్ సినిమాలలో విజయ్కు జోడీగా నటించింది.