
మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారువారి పాట నేటి నుంచి అమెజాన్ ప్రైమ్లో విడుదలైంది. కానీ ఆ సినిమాను ఉచితంగా చూసేందుకు వీలుపడదు. సినిమా చూడాలంటే రూ.199 అద్దె చెల్లించుకోవలసిందే. అమెజాన్ ప్రైమ్ వెబ్సైట్లో స్టోర్ ఆప్షన్లో ఆద్దెకు లభించే సినిమాల జాబితా ఉంటుంది. దానిలో సర్కారువారి పాటతో సహా మనకు నచ్చిన సినిమాను ఎంచుకొని అద్దె చెల్లించినట్లయితే ఆ రోజు నుంచి 30 రోజుల లోగా ఆ సినిమాను చూడవచ్చు. కానీ షరతు ఏమిటంటే, ఒకసారి సినిమా చూడటం మొదలుపెడితే 48 గంటలలోగా సినిమాను పూర్తిగా చూడాలి లేకుంటే ఇక చూడటం సాధ్యపడదు. చూడాలనుకొంటే మళ్ళీ రూ.199 అద్దె చెల్లించుకోవలసిందే. అమెజాన్ ప్రైమ్లో కేజీఎఫ్2 కూడా ఇదే విధానంలో అందుబాటులో ఉంది.
కుటుంబ సమేతంగా థియేటర్కు వెళ్ళి చూడాలంటే కనీసం రూ.1,000కి తక్కువ కాదు. కనుక ఇంట్లోనే రూ.199కి కుటుంబ సమేతంగా చూడవచ్చు. ఇదీ ఎక్కువే అనుకొనేవారు మరో నెల రెండు నెలలు వేచి చూస్తే అప్పుడు అద్దె చెల్లించకుండానే చూడవచ్చు.