
కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నిన్న మీడియాతో మాట్లాడుతూ తాను కేసీఆర్ చావు కోరుకుంటున్నానని చెప్పడం, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మద్య జరుగుతున్న రాజకీయ యుద్ధాలలో మరింత నిప్పు రాజేసింది.
నాలుగు రోజుల క్రితం కేసీఆర్ నోట కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తన చావు కోరుకుంటోందనే మాట వచ్చింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడిన ఈ మాట కేసీఆర్ చెప్పిన విషయాన్ని ధృవీకరిస్తున్నట్లే ఉంది. ఇది వివాదాస్పదంగా మారడంతో నేడు అయన సోషల్ మీడియాలో ఓ వీడియో సందేశం విడుదల చేశారు.
దానిలో అయన ఏమన్నారంటే, “నేను కేసీఆర్ చావు కోరుకోలేదు. ఆయనంటే నాకు చాలా గౌరవం. నిన్న ఏదో ఫ్లోలో అలా అనేశాను. ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా జీవించాలని, రాష్ట్రానికి మరింత సేవ చేయాలని కోరుకుంటున్నాను. అయన శాసనసభ సమావేశాలకు హాజరయ్యి తన అనుభవంతో ప్రభుత్వానికి తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.
కానీ ఒకసారి నోరు జారాక దానిని వెనక్కు తీసుకోవడం సాధ్యం కాదు. కానీ నిన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు తాత మధు, నవీన్ రెడ్డి, నేడు కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వెనక్కు తీసుకుంటున్నామని చెప్తున్నారు.