నా చావు కోరేవారితో సమావేశం.. చర్చలా? కేసీఆర్‌

సోమవారం నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. కనుక బీఆర్ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ అధ్యక్షతన ఫామ్‌హౌసులో పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. దీనిలో కేసీఆర్‌ పార్టీ ప్రజాప్రతినిధులతో మాట్లాడుతూ, “నా చావు కోరుకునే బూతుల వీరుడితో శాసనసభలో నేను చర్చించాలా? ఒకవేళ నేను వచ్చినా నన్ను మాట్లాడనిస్తారా?మరి నేను శాసనసభకు వచ్చి ఏం ప్రయోజనం? త్వరలో లక్ష మందితో కాళేశ్వరం, పాలమూరు  ప్రాజెక్టుల వద్దకు వెళ్తాం. అక్కడే ప్రజల సమక్షంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం. 

కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన అట్టర్ ఫ్లాప్. వచ్చే ఎన్నికలలో ఓడిపోతామని గ్రహించారు. అందుకే అందరూ అందిన కాడికి దోచేసుకుంటున్నారు. ప్రజా సమస్యలపై మీరు ఉభయసభలలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలి.

ప్రభుత్వం పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఏయే అంశాలలో ప్రజలు ఏమనుకుంటున్నారో శాసనసభలో గట్టిగా చెప్పి, ప్రజావ్యతిరేక పాలన చేస్తున్నందుకు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలి,” అని కేసీఆర్‌ చెప్పినట్లు సమాచారం.

శాసనసభ, మండలిలో లేవనెత్తాల్సిన అంశాలు, వాటికి అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్‌ బీఆర్ఎస్‌ పార్టీ ప్రజాప్రతినిధులకు మార్గదర్శనం చేశారు. కనుక ఈసారి శాసనసభ సమావేశాలు మరింత వాడివేడిగా సాగనున్నాయని అప్పుడే స్పష్టం అయ్యింది.