మారిపల్లి మాధవి చేతికి తెలంగాణ జాగృతి

ఇంతకాలం కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి బాధ్యతలు స్వయంగా చూసుకునేవారు. కానీ టీఆర్ఎస్‌ పార్టీ ఏర్పాటు తర్వాత దాని రాజకీయ కార్యక్రమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. కనుక తెలంగాణ జాగృతి బాధ్యతలు మహాబూబాద్‌కు చెందిన మారిపల్లి మాధవికి అప్పగించారు. ఆమెను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా నియమిస్తున్నట్లు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. అయితే అది ఎప్పటిలాగే టీఆర్ఎస్‌ పార్టీకి అనుబంధంగా పనిచేస్తుంటుంది. 

టీఆర్ఎస్‌ పార్టీలో పలు పదవులను కూడా కల్వకుంట్ల కవిత భర్తీ చేశారు. మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా పడాల మనోజ్ గౌడ్, ఉపాధ్యక్షురాలిగా అయిలి కవిత, ప్రధాన కార్యదర్శిగా కనగల చైతన్యలను నియమించారు. 

బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా అల్లంపల్లి రామకోటి, ఉపాధ్యక్షులుగా శైలజా గౌడ్, కుసుమ రజిత, ప్రధాన కార్యదర్శిగా నర్సింహలను నియమించారు. 

టీఆర్ఎస్‌ పార్టీ విద్యార్ధి విభాగం రాష్ట్ర అధ్యక్షుడుగా రాము యాదవ్, ఉపాధ్యక్షురాలిగా రాధాశ్రీ, ప్రధాన కార్యదర్శిగా నవీన్ గౌడ్‌లను నియమించారు.