
టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇంత కాలం తెలంగాణ జాగృతి పేరుతో రాజకీయాలు, ట్వీట్స్ చేస్తుండేవారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పేరుతో సోషల్ మీడియాలో తొలి ట్వీట్ చేశారు. “మీ టైమ్ అయిపొయింది. మా టైమ్ మొదలైంది #టీఆర్ఎస్ అని ట్వీట్ చేశారు.
ఆమె బీఆర్ఎస్ పార్టీ, దాని అధినేత కేసీఆర్ని ఉద్దేశ్యించి ఈవిధంగా ట్వీట్ చేశారని అర్ధమవుతూనే ఉంది. దీనిపై బీఆర్ఎస్ పార్టీ స్పందించలేదు. కానీ కేసీఆర్ అభిమానులు ఘాటుగానే స్పందిస్తున్నారు.
“మీరు ఎవరి టైమ్ అయిపోయిందనుకుంటున్నారో.. మీ టైమే అయిపొయిందని తెలుసుకోండి. సొంత తండ్రి గురించి ఈవిధంగా మాట్లాడే మీలాంటి వాళ్ళు రాష్ట్రంలో యువతకి ఏం సందేశం ఇస్తున్నారు. మీ తండ్రి మొహం చూసే అందరూ మీకు గౌరవం ఇస్తున్నారని గ్రహిస్తే మంచిది,” అని ఒకరు ట్వీట్ చేశారు.
మరొకరు “ఓ ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలి. కానీ ఎప్పుడూ అన్న, తండ్రి మీద పది ఏడుస్తూనే ఉంటారు,” అని ట్వీట్ చేశారు.
మరొకరు రావు రమేష్ నటించిన ఓ సినిమాలో ఫోటో పెట్టి, దానిలో ఆయన పలికిన పాపులర్ డైలాగ్, “ శత్రువు ఎక్కడో ఉండర్ర్రా. ఇదిగో మన చుట్టూ ఇలా కూతుర్లు, చెల్లెళ్ళ రూపంలో తిరుగుతూ ఉంటారు,” అని వ్యంగ్యంగా కవిత తీరుని ఆక్షేపించారు.
మరొకరు, “ముందు కల్వకుంట్ల అనే పదం తీసేస్తారా..ఆ పదం ఇచ్చిన కేసీఆర్ గారు నచ్చక పోతే ఆ పదం ఎందుకు..అయినా పెళ్లి అయిన తర్వాత అత్తారింటి పేరు కదా వుండాల్సింది..,” అంటూ తండ్రి పేరు చెప్పుకునే నేటికీ రాజకీయాలు చేస్తున్నావని ఎద్దేవా చేశారు.