
యూసఫ్ గూడాలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఈరోజు ఉదయం 8 గంటలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు మొదలైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తున్నారు.
కాంగ్రెస్ అభ్యర్ధిగా నవీన్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ మాగంటి సునీత, బీజేపి అభ్యర్ధిగా లంకల దీపక్ రెడ్డి, మరో 53 మంది స్వతంత్ర అభ్యర్ధులు ఈ ఉప ఎన్నికలో పోటీ పడ్డారు. కానీ పోటీ ప్రధానంగా కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీల మధ్యనే సాగింది. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ స్వల్ప మెజార్టీతో విజయం సాధించబోతోందని సర్వే సంస్థలు జోస్యం చెప్పాయి.
ఓట్ల లెక్కింపు కోసం 42 టేబిల్స్ ఏర్పాటు చేసి 186 మంది సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పది రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈసారి కూడా పోలింగ్ 49 శాతం దాటలేదు. కనుక ఈవీఎంలలో నిక్షిప్తమైన సుమారు రెండు లక్షల ఓట్లు లెక్కించడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. మధ్యాహ్నం 11-12 గంటలలోపే ఎవరు విజయం సాధిస్తారనేది స్పష్టమవచ్చు.