సిఎం రేవంత్ రెడ్డి సోమవారం ఉస్మానియా యూనివర్సిటీలో సోమవారం ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ బీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడ్డారు. “మేమే తెలంగాణ రాష్ట్రం సాధించామని బీఆర్ఎస్ పార్టీ నేతలు గొప్పగా చెప్పుకుంటారు. కానీ ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుతోనే వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారు.
లక్ష కోట్లు పెట్టి కట్టించిన ఆ ప్రాజెక్ట్ ఎందుకూ పనికిరాకుండా పోయిందిప్పుడు. తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ పట్టిన చెద బీఆర్ఎస్ పార్టీ. ఇది రాష్ట్రాన్ని గుల్ల చేసేసింది. ఆ చెదలు గుర్తింఛి తొలగింఛి మళ్ళీ రాష్ట్రాన్ని గాడిన పెట్టుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
కానీ బీఆర్ఎస్ పార్టీ మాపై నిత్యం తప్పుడు ప్రచారం చేస్తూనే ఉంది. కంచ గచ్చిబౌలి భూముల్లో ఏనుగులు, సింహాలు నివాసం ఉన్నట్లు ఏఐతో బొమ్మలు, వీడియోలు సృష్టించి వాటిని మా ప్రభుత్వం చంపుతోందని దుష్ప్రచారం చేశారు. ఎక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టిన స్థానికులను రెచ్చగొట్టి అడ్డుకుంటున్నారు.
హైదరాబాద్లో కబ్జాలకు గురైన వేలకోట్లు విలువైన ప్రభుత్వ భూములలో ఆక్రమణలను హైడ్రా తొలగిస్తుంటే పేదల ఇళ్ళు కూల్చేస్తున్నమంటూ దుష్ప్రచారం చేస్తోంది. తెలంగాణలో గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకి ఈగిల్ ఫోర్స్ ఏర్పాటు చేస్తే తప్పు పడుతున్నారు.
తెలంగాణ బిడ్డలు ఎవరూ చదువుకోకూడదనే ఆలోచనతోనే కేసీఆర్ వారికి కులాలు వారీగా గొర్రెలు, చేపలు పంచిపెట్టారు తప్ప వారి మేలు కోరికాదు. కానీ నేను నా తెలంగాణ బిడ్డలు బాగా చదువుకొని ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు అవ్వాలని జీవితంలో రాణించాలని కోరుకుంటున్నాను.
ఒకవేళ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉస్మానియా యూనివర్సిటీలో వెంచర్స్ వేసి అమ్మేస్తుంది. కనుక అలాంటి బీఆర్ఎస్ పార్టీకి విద్యార్ధులు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. యూనివర్సిటీ, విద్యార్ధుల సమస్యలుంటే నేరుగా సచివాలయానికి వచ్చి నన్ను మంత్రులను కలిసి మాట్లాడవచ్చు బీఆర్ఎస్ పార్టీ ఉచ్చులో పడవద్దు,” అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.
కేసీఆర్ కుటుంబం.. తెలంగాణకు పట్టిన చెదలు @revanth_anumula pic.twitter.com/dPocfovnE6
— Telangana Congress (@INCTelangana) August 25, 2025