యూరియా కొరతపై కాంగ్రెస్‌ మంత్రులు మాట్లాడరేమి?

తెలంగాణలో యూరియా కొరత చాలా తీవ్రంగా ఉంది. దీని గురించి ప్రతీరోజూ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. బీఆర్ఎస్‌ పార్టీ అయితే మరో అడుగు ముందుకు వేసి యూరియా కోసం క్యూకట్టిన రైతుల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడుతూ రోజూ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంది. 

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే మళ్ళీ రైతులకు మళ్ళీ యూరియా కష్టాలు మొదలయ్యాయని విమర్శిస్తూనే ఉంది. కానీ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కానీ ఇతర మంత్రులు గానీ దాని ప్రశ్నలు, విమర్శలకు సమాధానం చెప్పకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. యూరియా కష్టాలకు వారు కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. 

వర్షాలు మొదలైనప్పటికీ ఇంతవరకు యూరియా అందుబాటులో లేకపోవడంతో ఎరువుల దుకాణాల వద్ద పడిగాపులు కాస్తున్న రైతుల ఆగ్రహం నానాటికీ పెరుగుతూనే ఉంది. 

యూరియా కొరతకి కాంగ్రెస్‌ ప్రభుత్వం అసమర్దతే కారణమని   బీఆర్ఎస్‌ పార్టీ చేస్తున్న వాదనలు  వారిపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిసి కూడా కాంగ్రెస్‌ మంత్రులు మౌనంగా ఉండిపోవడం ఇంకా కాంగ్రెస్‌ పార్టీకి ఇంకా నష్టం కలిగిస్తుంది. 

గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు రైతులు ఎన్నడూ యూరియా కోసం ఈవిదంగా ఎరువుల దుకాణాల వద్ద పడిగాపులు కాయలేదనే బీఆర్ఎస్‌ పార్టీ నేతల వాదనలతో రైతులు కనెక్ట్ అవుతున్నారనే విషయం కాంగ్రెస్‌ మంత్రులు గ్రహించారో లేదో తెలీదు. కానీ వీలైనంత త్వరగా రైతులకు యూరియా అందించలేకపోతే దీనికి స్థానిక సంస్థల ఎన్నికలలో మూల్యం చెల్లించాల్సి వచ్చినా ఆశ్చర్యం లేదు.